హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోకి అక్రమ మద్యం దిగుమతిపై ఉక్కుపాదం మోపాలని డీజీపీ అంజనీకుమార్ ఆదేశించారు. శనివారం హైదరాబాద్లో అక్రమ మద్యం రవాణా నిరోధంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సరిహద్దు, ఉత్తరాది రాష్ర్టాల నుంచి తెలంగాణకు అక్రమ మద్యం రవాణా అవుతున్నదని తెలిపారు. దీనిని అరికట్టేందుకు రాష్ట్ర పోలీసులు, ఎక్సైజ్, రైల్వే, ట్రాన్స్పోర్ట్ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. 2014 నుంచి తెలంగాణలో అక్రమ మద్యం నివారణ కోసం 27,883 మందిపై కేసులు న మోదు చేశామని సీఐడీ విభాగం అడిషనల్ డీజీ మహేశ్ భాగవత్ వెల్లడించారు. అక్రమ మద్యం దిగుమతి ఒక వ్యవస్థీకృత నేరంగా మారిందని, దీనివల్ల రాష్ట్ర ఆదాయంపై గణనీయమైన ప్రభావం పడుతుందని ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ అన్నారు. అక్రమ మద్యం రవాణా చేసే వారిని గుర్తించి, వారి జాబితాను సిద్ధం చేశామని ఇంటెలిజెన్స్ డీఐజీ కార్తికేయ వెల్లడించారు. సమావేశంలో రైల్వేస్ అడిషనల్ డీజీ శివధర్రెడ్డి, శాంతిభద్రతల విభాగం ఏడీజీ సంజయ్కుమార్ జైన్, ఐజీ షానవాజ్ ఖాసీం, ఎక్సైజ్ జాయిం ట్ కమిషనర్ సయ్యద్ ఖురేషి, ఆర్పీఎఫ్ కమాండెంట్ దేబోస్మితా బెనర్జీ, ఎస్పీలు షేక్ సలీ మా, విజయ్కుమార్, వెంకటేశ్వర్లు, స్నిగ్ధారెడ్డి పాల్గొన్నారు.