సూర్యాపేట : సీపీఆర్(CPR) ద్వారా గుండెపోటు మరణాలను 50శాతం వరకు తగ్గించవచ్చని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి(Minister Jagadish Reddy) అన్నారు. సూర్యాపేట కలెక్టరేట్లో శుక్రవారం సీపీఆర్ పై శిక్షణా తరగతులను మంత్రి ప్రారంభించి మాట్లాడారు. ఆకస్మిక గుండెపోటు(Heart problems) వల్ల వ్యక్తులు మరణించకుండా సీపీఆర్ చేయడం వలన ప్రాణాలను కాపాడిన వారమవుతామని పేర్కొన్నారు.
వయసుతో నిమిత్తం లేకుండా ఆకస్మిక గుండెపోటు వల్ల అనేకమంది మరణిస్తున్నట్లు వస్తున్న వార్తలు బాధను కలిగిస్తున్నాయని అన్నారు. ఆకస్మిక గుండెపోటు వల్ల సంభవించే మరణాలను తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్డియో పల్మనరీససీటేషన్(CPR) పై వైద్య ఆరోగ్యశాఖతోపాటు సాధారణ ప్రజలందరికీ శిక్షణ కార్యక్రమాలు నిర్వ హించాలన్నారు. జీవన విధానం, వాతావరణం లో మార్పులు, ఆహారపు అలవాట్లు, ప్రకృతికి వ్యతిరేకంగా జరుగుతున్న పరిణామాలు,ఒత్తిడి తదితర కారణాల వల్ల గుండెపోటు వచ్చే అవకాశాలున్నాయని తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం వైద్యరంగంలో వేగంగా మార్పులు తీసుకువచ్చిందని కొనియాడారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వ దవాఖాన(Government Hospitals)లపై నమ్మకం ఏర్పడడంతో ప్రజలు అధిక సంఖ్యలో ప్రభుత్వ ఆసుపత్రులను వెళుతున్నారని పేర్కొన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ప్రసవాలు సంఖ్య పెరిగిందని అన్నారు.
ఈ సందర్భంగా సీపీఆర్ పై శిక్షణ పొందిన వారికి మంత్రి ,జిల్లా కలెక్టర్ ధ్రువ ప్రతాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ, గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టా కిషోర్, జడ్పీ చైర్మన్ గొప్పగాని వెంకటనారాయణ గౌడ్ , జడ్పీటీసీ జీడి బిక్షం, జిల్లా ఆదనపు కలెక్టర్ ఎస్ మోహన్ రావు, డీఎంహెచ్వో కోటాచలం, ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు.