న్యూఢిల్లీ, ఏప్రిల్ 28(నమస్తే తెలంగాణ): ప్రధాన కమ్యూనిస్టు పార్టీలు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ వెంటే ఉంటాయని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వెల్లడించారు. సీట్ల సర్దుబాటుపై ఇంకా నిర్దిష్టంగా నిర్ణయాలు జరగనప్పటికీ బీఆర్ఎస్తోనే కలిసి ముందుకెళ్తామని స్పష్టం చేశారు. ఢిల్లీలోని హరికిషన్సింగ్ సూర్జిత్ భవన్లో శుక్రవారం జరిగిన సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాలకు హాజరైన తమ్మినేని మీడియాతో మాట్లాడారు.
2024 ఎన్నికల్లో బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా బీఆర్ఎస్ ముందుకెళ్తూ.. ఇతర రాష్ర్టాలలో విస్తరణకు ప్రయత్నించడం శుభసూచికమని పేర్కొన్నారు. తెలంగాణలో రాజకీయ పరిస్థితి చాలా స్పష్టంగా ఉన్నదని, బీఆర్ఎస్ ఆధిక్యంలో ఉన్నదని, కాంగ్రెస్ రెండో స్థానంలో ఉన్నదని అన్నారు. అమిత్షా, నడ్డా, మోదీ వగైరాలు ఎన్నిసార్లు పర్యటించినా.. బీజేపీలోకి చేరికలు జరగడం లేదని చెప్పారు. బీసీల జనాభా లెక్కలు తీయాలని పదేపదే పార్లమెంట్లో డిమాండ్లు వచ్చినప్పటికీ, బీసీ ప్రధానిగా ఉన్న మోదీ జనగణన ఎందుకు చేపట్టడం లేదని ప్రశ్నించారు.