నల్లగొండ : తన స్వార్థం కోసం ఉప ఎన్నికను తీసుకొచ్చిన బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని చిత్తుచిత్తుగా ఓడించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. చండూరు మండలం బంగారిగడ్డలో నిర్వహించిన టీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభలో తమ్మినేని వీరభద్రం పాల్గొని ప్రసంగించారు. ఏడాది తర్వాత జరగాల్సిన ఎన్నికలు ఇప్పుడు ఎందుకు వచ్చాయి? అని ఆయన ప్రశ్నించారు. ఈ నాలుగేండ్ల కాలంలో ప్రభుత్వం అభివృద్ధికి సహకరించలేదు కాబట్టి.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని చెబుతున్నాడు. నియోజకవర్గ అభివృద్ధికి మాత్రమే ఈ నిర్ణయం తీసుకున్నానని చెబుతున్నాడు.
ఇది వాస్తవం కాదు. వాస్తవం ఏంటంటే.. బీజేపీ అధిష్టానం ఢిల్లీ నుంచి సాగించిన కుట్ర ఫలితంగా ఈ ఎన్నిక వచ్చింది. రాజగోపాల్ రెడ్డికి రూ. 22 వేల కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. కానీ రూ. 18 వేల కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చారని రాజగోపాల్ రెడ్డినే ఒప్పుకున్నారు. అంటే ఆయనకు బీజేపీ కాంట్రాక్ట్ ఇచ్చినందుకే రాజీనామా చేశానని చెప్పకనే చెప్పారు రాజగోపాల్ రెడ్డి.
పార్టీలు మారితే నష్టం లేదు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయకముందే.. బీజేపీ వద్ద గత మూడేండ్ల నుంచి అక్రమ సంబంధం పెట్టుకున్నాడట. ఇలాంటి అవినీతిపరులను, స్వార్థపరులను చిత్తుచిత్తుగా ఓడించాలి. బీజేపీ ఒక దుర్మార్గమైన పార్టీ. రాష్ట్రాల హక్కులను కాలరాస్తుంది. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని సర్వనాశనం చేస్తోంది బీజేపీ పార్టీ. అనేక మతాలు, కులాల వారు కలిసిమెలిసి జీవిస్తున్నారు. హిందువులు మాత్రమే ఈ దేశంలో ఉండాలని తప్పుడు సిద్ధాంతాన్ని బీజేపీ ముందుకు తీసుకొస్తుంది. ప్రజాస్వామ్యాన్ని బీజేపీ పార్టీ నిలువునా పాతరేస్తుంది అని తమ్మినేని వీరభద్రం మండిపడ్డారు.