హైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): ఏపీ పునర్విభజన చట్టంలోని 13వ క్లాజులో ఖమ్మం జిల్లాలో రూ.30 వేల కోట్లతో ఉక్కు పరిశ్రమ ఏ ర్పాటు చేస్తామని స్పష్టంగా పేర్కొన్నప్పటికీ సర్వేల పేరుతో కేంద్రం కాలయాపన చేస్తున్నదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ధ్వజమెత్తారు.
సోమవారం హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. బయ్యారం ముడి ఇనుప ఖనిజం నాణ్యత లేదని కేంద్రమంత్రి కిషన్రెడ్డి వ్యాఖ్యానించడం తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునే కుట్రలో భాగమని మండిపడ్డారు. నాణ్యత ప్రమాణాలు లేవని అబద్ధాలు చెప్పడం కేంద్రమంత్రికి తగదని హితవు పలికారు. అబద్ధాలు మాని బయ్యారం ఉక్కు పరిశ్రమను వెంటనే నెలకొల్పేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
బయ్యారం ఖనిజంలో నాణ్యత లేకుంటే 200కు పైగా ప్రైవేటు కంపెనీలు ఎందుకు దరఖాస్తు చేశాయని ప్రశ్నించారు. గతంలో ఇక్కడ మైనింగ్ నిర్వహించి ఖనిజాన్ని ఎలా ఎగుమతి చేసి లాభాలు పొందారో, ఒక సంస్థ 2010 వరకు మైనింగ్ నిర్వహించి లక్షల టన్నులు ఎలా ఉత్పత్తి చేసిందో కేంద్రమంత్రి తెలుసుకోవాలని హితవు పలికారు. బీజేపీకి తెలంగాణ అభివృద్ధి మీద ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే బయ్యారం ఉక్కు పరిశ్రమ నెలకొల్పేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.