ఖమ్మం, నవంబర్ 21 (నమస్తేతెలంగాణ ప్రతినిధి): దేశ ఐక్యతకు బీజేపీ ప్రమాదకరంగా పరిణమించిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హెచ్చరించారు. లౌకిక శక్తులు దీన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగ ధర్మాలను మార్చి మనుధర్మాన్ని ఆచరణలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు.
సోమవారం ఖమ్మంలోని సుందరయ్య భవనంలో తమ్మినేని మాట్లాడుతూ.. బీజేపీ భావ జాలం, విష సంస్కృతి విస్తరించే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేటీకరణ దిశగా ఆర్థిక వ్యవస్థను నడిపిస్తున్న తీరును ఖండించారు. పోడు భూముల విషయంలో చట్ట ప్రకారం సర్వే నిర్వహించాలని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. బీజేపీ వ్యతిరేక పోరాటంలో లౌకిక, జాతీయ ప్రాంతీయ పార్టీలను కలుపుకొని పోతామని స్పష్టం చేశారు.