హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా బీజేపీని ఎదగకుండా అడ్డుకోవడమే వామపక్షాల లక్ష్యమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. హైదరాబాద్లోని సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో బుధవారం జరిగిన ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ కర్ణాటక ఫలితాల ప్రభావం తెలంగాణ రాజకీయాలపై చూపదని పేర్కొన్నారు.
ఆ ప్రభావం కాంగ్రెస్లో తాత్కాలికమేనని, జేడీఎస్ దెబ్బతినడం వల్లే కాంగ్రెస్ ఎక్కువ సీట్లు సాధించిందని తేల్చిచెప్పారు. కేంద్ర ప్రభుత్వం పట్ల ప్రజల్లో అసంతృప్తి ఉన్నదని తెలిపారు. కేంద్రం విధానాలపై వామపక్షాలను కలుపుకొని బీఆర్ఎస్ పార్టీ ప్రజా ఉద్యమాలు చేపట్టాలని కోరారు. రూ.రెండువేల నోట్ల రద్దు అనవసర చర్య అని, రాజకీయ లబ్ధి కోసమే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదని విమర్శించారు. రాష్ట్రాల స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా అన్ని శక్తులూ ఏకం కావాలని, ఎన్నికల అనంతరం బీజేపీయేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే సరైన మార్గమని తమ్మినేని వీరభద్రం తెలిపారు.