మునుగోడు, నవంబర్ 9 : తెలంగాణలో గవర్నర్ వ్యవస్థ రాజకీయ వ్యవస్థగా మారిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. గవర్నర్ వ్యవస్థను తాము ఎప్పటినుంచో వ్యతిరేకిస్తున్నామన్నారు. ప్రస్తుతం తెలంగాణలో గవర్నర్ పనితీరు బాగాలేదని చెప్పారు. గవర్నర్ బీజేపీకి వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. బుధవారం నల్లగొండ జిల్లా మునుగోడులో నిర్వహించిన సీపీఎం నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.
రామగుండం ఎరువుల కంపెనీ ఎప్పుడో ప్రారంభమైనా ప్రధాని మోదీ దానిని ప్రారంభించేందుకు ఈ నెల 12న రాష్ర్టానికి వస్తుండటం విడ్డూరంగా ఉన్నదన్నారు. మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ గెలుపు సమష్టి కృషి ఫలితమని పేర్కొన్నారు. టీఆర్ఎస్తోపాటు సీపీఎం కార్యకర్తలు కష్టపడి చేశారని,ఐక్యతతో బీజేపీ అభ్యర్థిని ఓడించగలిగామన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణలో బీజేపీ ఎదుగుదలను అడ్డుకుంటామని చెప్పారు. సమావేశంలో చెరుపల్లి సీతారాములు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి తదితరులు పాల్గొన్నారు.