హైదరాబాద్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ): ఓటమి భయంతోనే బీజేపీ నాయకు లు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని సీపీ ఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. తీరు మార్చుకోకపోతే పరిణామా లు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. కమ్యూనిస్టులు టీఆర్ఎస్కు మద్దతు ప్రకటించడాన్ని బీజేపీ నేతలు భరించలేకపోతున్నారన్నారు. మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలుస్తారని వారికి అర్థమైందని.. అందుకే కమ్యూనిస్టులపై నోరుపారేసుకుంటున్నారని అన్నారు. సోమవారం హైదరాబాద్లోని ఎంబీ భవన్లో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వీరయ్యతో కలిసి తమ్మినేని మాట్లాడారు. టీఆర్ఎస్కు కమ్యూనిస్టులు అమ్ముడుపోయారని బీజేపీ నేతలు మాట్లాడ టం దుర్మార్గమని, అమ్ముడుపోయే చరిత్ర కమ్యూనిస్టులకు లేదని స్పష్టంచేశారు.
రూ. 18 వేల కోట్ల కాంట్రాక్టు వచ్చిందని బీజేపీ అభ్యర్థి రాజగోపాల్రెడ్డే స్వయంగా చెప్తున్నారని, ఇలా అమ్ముడుపోయినవారు కమ్యూనిస్టులపై అభాండాలు వేయడం విడ్డూరంగా ఉన్నదన్నారు. మునుగోడు అభివృద్ధి కోసమే రాజీనామా చేసినట్టు రాజగోపాల్ ప్రకటించ డం పచ్చి అబద్ధమని విమర్శించారు. రాష్ట్రం లో పాగా వేయాలన్న బీజేపీ కుట్రలో భాగంగానే ఈ ఉపఎన్నిక వచ్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చే కుట్రతోనే టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం సాగిందని తెలిపారు. గత నెల 20న మునుగోడు సభలో ‘మీరు రాజగోపాల్రెడ్డిని గెలిపించండి. నెలరోజుల్లో ఈ ప్రభుత్వాన్ని కూల్చుతాం’ అని సాక్షాత్తు కేంద్ర హోంమంత్రి అమిత్షా వ్యాఖ్యానించారని గుర్తుచేశారు. ఎమ్మెల్యేల ను లొంగదీసుకొనేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేసి, ఈడీ, సీబీఐని ప్రయోగిస్తున్నదని తమ్మినేని చెప్పారు. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని భారీమెజార్టీతో గెలిపించాలని మునుగోడు ఓటర్లను కోరారు. మంగళవారం మునుగోడులో భారీ మోటర్ సైకిల్ ర్యాలీ నిర్వహిస్తున్నామని చెప్పారు.