కృష్ణకాలనీ, మార్చి 18 : దేశంలో బీజేపీ ప్రజా వ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా సీఎం కేసీఆర్ ధర్మపోరాటం చేస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజా చైతన్య యాత్ర శనివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాకేంద్రానికి చేరుకున్నది. ఈ సందర్భంగా హనుమాన్ దేవాలయం నుంచి మున్సిపల్ స్టేడియం వరకు భారీ ర్యాలీ నిర్వహించి మున్సిపల్ స్టేడియంలో బహిరంగ సభ నిర్వహించారు. తమ్మినేని వీరభద్రం, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పాలనలో రైతులు ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందినట్టు తెలిపారు.
ప్రధాని నరేంద్రమోదీ దేశంలో రైతు వ్యతిరేక చట్టాలను తీసుకువచ్చి 700 మంది రైతులను పొట్టన పెట్టుకున్నారని ఆరోపించారు. 2022 నాటికి దేశంలో ఇండ్లులేని పేదలుండరని చెప్పిన బీజేపీ ఏ ఒక్కరికీ ఇల్లు ఇవ్వలేదన్నారు. కుల, మతాల మధ్య చిచ్చుపెట్టి ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. దేశంలో ఎవరైనా బీజేపీ పాలనను వ్యతిరేకిస్తే అక్కడి ముఖ్యమంత్రి, మంత్రులపై ఈడీ, సీబీఐ దాడులు చేయిస్తూ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ప్రభుత్వాలను నిర్ధాక్షిణ్యంగా కూల్చేస్తున్నారని ధ్వజమెత్తారు.
మోదీ దగ్గరి మిత్రుడు గౌతం అదానీ ఎల్ఐసీ, ప్రపంచ బ్యాంకుల నుంచి అప్పు తీసుకొని ఎగ్గొట్టి రూ.17 వేల కోట్లకు ఆస్థిపరుడైతే అతడిపై ఎందుకు కేసులు పెట్టలేదో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. దేశంలోని కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తూ పేద ప్రజలను అణగదొక్కుతున్నాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. మోదీ హయాంలో దేశంలో మహిళలపై లైంగిక దాడులు, హత్యలు జరుగుతున్నాయని విమర్శించారు. దేశంలో ఆడవాళ్లను అగౌరవ పరుస్తూ, ఇంట్లో వస్తువులతో పోలుస్తూ బీజేపీ సభ్యులు పార్లమెంట్లో మాట్లాడటం సిగ్గుచేటన్నారు. సీఎం కేసీఆర్ రైతుల పట్ల ధర్మపోరాటం చేస్తున్నారని తెలిపారు. రైతులకు అండగా పోరాడుతున్నందునే బీజేపీ కక్షగట్టి సీఎం కూతురు కవితపై, తెలంగాణ మంత్రులపై, ఎమ్మెల్యేలు, ఎంపీల మీద ఈడీ, సీబీఐ దాడులు చేయిస్తున్నదని విమర్శించారు. నరేంద్ర మోదీని గద్దెదించే దాకా సీపీఎం, సీపీఐలు సీఎం కేసీఆర్ వెంటే ఉంటాయని ప్రకటించారు. బీజేపీపై సీఎం కేసీఆర్ చేస్తున్న పోరాటంలో సీఎం కేసీఆర్కు బాసటగా నిలుస్తామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు.