హైదరాబాద్, ఫిబ్రవరి 16(నమస్తే తెలంగాణ): బీజేపీ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తున్నామని ఓవైపు చెబుతూ, మరోవైపు కర్ణాటక, తెలంగాణలో నాలుగు లేబర్కోడ్లను అమలు చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ చర్యలు చేపట్టిందని సీపీఎం జాతీయ కార్యదర్శి ఎంఏ బేబీ విమర్శించారు. ఆ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు తమ నిర్ణయాన్ని వెనకి తీసుకోవాలని డిమాండ్చేశారు. సోమవారం హైదరాబాద్లోని సీపీ ఎం రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తున్న ప్రజా, కార్మిక , రైతు వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ ఢిల్లీలోని రాంలీలా మైదాన్లో మార్చి 24న ధర్నా నిర్వహించనున్నట్టు వెల్లడించారు.
అమెరికాతో ఇటీవల మోదీ సరార్ చేసుకున్న వాణిజ్య ఒప్పందం దేశ సమగ్రతకే ప్రమాదకరమని హెచ్చరించారు. దీని ప్రభావం ఒక వ్యవసాయరంగానికే పరిమితం కాదని, అన్ని రంగాలపైనా పడేప్రమాదమున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. భారత్ ఏ దేశం నుంచి చమురును దిగుమతి చేసుకోవాలనే విషయాన్ని ట్రంప్ నిర్ణయించడమేంటని ప్రశ్నించారు. కేంద్రం కొత్తగా తెచ్చిన వీబీజీ-రామ్జీ పథకంలో కూలీల పనిదినాలు పెంచుతామని చెప్పడం పెద్ద మోసమని మండిపడ్డారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎన్నికల హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. పట్టణ, స్థానిక ఎన్నికల్లో ఎకువ సీట్లలో సొంతంగా పోటీ చేశామని, నిరుడు 12 సీట్లు ఉండగా, ప్రస్తుతం 13 గెలిచామని తెలిపారు.