హైదరాబాద్ : తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారాన్ని ఖండించిన సీపీఎం ఖండించింది. ఆ పార్టీ కేంద్ర కమిటీ సమావేశాల్లో తెలంగాణ పరిణామాలపై చర్చించారు. సమావేశంలో సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రాంతీయ పార్టీలను విచ్ఛిన్నం చేయాలని చేస్తోందని, నలుగురు ఎమ్మెల్యేలకు డబ్బుతో ఎర వేయాలని చూసిందని విమర్శించారు.
గతంలో మహారాష్ట్ర, కర్ణాటకలో ఇదే విధంగా ఫిరాయింపులను ప్రోత్సహించిందని ఆరోపించారు. ప్రజాస్వామ్యం, ఎన్నికల వ్యవస్థపై నమ్మకం లేనట్లు బీజేపీ వ్యవహరిస్తుందని, ఎన్నికల్లో ఎవరు గెలిచినా డబ్బుతో కొనుగోలు చేయొచ్చని బీజేపీ భావిస్తోందని మండిపడ్డారు. ప్రజాస్వామ్యయుత పార్టీలన్నీ బీజేపీ చర్యలను ఖండించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రతిష్ట నిలబెట్టేలా పార్టీలు వ్యవహరించాలన్నారు.
గవర్నర్లు, డబ్బుని వినియోగిస్తూ బీజేపీ ప్రభుత్వాలను విచ్ఛిన్నం చేయాలని, సమాఖ్య స్ఫూర్తిని దెబ్బ తీసేలా బీజేపీ వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య, ఫెడరల్ వ్యవస్థలను కాపాడేందుకు కలిసొచ్చే వారిని సమీకరించి ఉద్యమాన్ని రూపొందించాలని కేంద్ర కమిటీ ఈ సందర్భంగా భావించింది. కేంద్ర విధానాలతో ప్రజా సమస్యలు, ధరలు పెరుగుతున్నాయని, భవిష్యత్లో ప్రజా సంఘాలు, కార్మిక సంఘాల ఉద్యమాలకు సీపీఎం మద్దతు ఇస్తుందని రాఘవులు తెలిపారు.