హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ): పెరుగుతున్న ధరలను నియంత్రించడంలో కేంద్రంలోని బీజేపీ సర్కారు ఘోరంగా విఫలమైందని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు విమర్శించారు. అందుకు టమాటా, ఇతర కూరగాయలు, నిత్యావసరాల ధరల పెరుగుదలే నిదర్శనమని పేర్కొన్నారు. హైదరాబాద్ ఎంబీ భవన్లో ఆదివారం సీపీఎం రాష్ట్ర కమిటీ ముగింపు సమావేశాల్లో ఆయన మాట్లాడారు. బీజేపీని ఎదుర్కొనేందుకు భావసారూప్యత ఉన్న రాజకీయ శక్తులను సమీకరించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.
టోకు వ్యాపారులకు కనక వర్షం కురిపించడం కోసమే మోదీ సర్కార్ ధరల నియంత్రణ చర్యలు చేపట్టడం లేదని ధ్వజమెత్తారు. తమ పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకొనేందుకు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు ఉమ్మడి పౌరస్మృతి అంశంపై కేంద్రం చర్చను లేవనెత్తిందని చెప్పారు. మణిపూర్లో ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించి, విధ్వంసాన్ని సృష్టించడంలో సంఘ్ పరివార్ పాత్ర ఉందని ఆరోపించారు. వచ్చే అన్ని ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే సీపీఎం ముఖ్య కర్తవ్యమని తెలిపారు.