హైదరాబాద్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ): దేశ ప్రజల సొమ్మును అదానీ సంస్థ కాజేస్తుంటే చూస్తూ ఊరుకోబోమని, అదానీ కుట్రలను నిగ్గు తేల్చాల్సిందేనని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు డిమాండ్ చేశారు. కేంద్రం దిగొచ్చి జేపీసీ లేదా సీజేఐతో ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని కోరారు. అదానీ పెట్టుబడులు, షేర్ల పతనానికి సంబంధించిన అక్రమాలపై ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయని, చర్చ చేపట్టేందుకు మోదీ సర్కారుకు భయమెందుకని ప్రశ్నించారు. హైదరాబాద్లోని ఎంబీభవన్లో మంగళవారం సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. అనంతరం రాఘవులు మీడియాతో మాట్లాడుతూ.. అదానీకి రూ.80 వేల కోట్లు ఎల్ఐసీ, రూ.25 వేల కోట్లు ఎస్బీఐ రుణం ఇచ్చిందని, అవి మునిగిపోయినా, చెల్లించకపోయినా ఫరవాలేదంటూ కేంద్రం భావిస్తున్నదని విమర్శించారు.
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నదని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు ఏ విజయరాఘవన్ విమర్శించారు. ప్రజాస్వామ్యం, లౌకికత్వం ప్రమాదంలో ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో పొత్తులపై త్వరలో సీపీఐతో చర్చిస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు. బీజేపీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్తో కలిసి పనిచేస్తామని తెలిపారు. అంతమాత్రాన బీఆర్ఎస్తో పొత్తు ఉంటుందని ఇప్పుడే చెప్పలేమన్నారు. సమావేశంలో సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు తదితరులు పాల్గొన్నారు.