మహబూబాబాద్ రూరల్, జూన్ 18: కేంద్రంలో, రాష్ర్టాల్లో తమ పార్టీనే అధికారంలో ఉండాలన్న ఉద్దేశంతో బీజేపీ నేతృత్వంలోని మోదీ సర్కార్.. పదే పదే తమది డబుల్ ఇంజిన్ సర్కార్ అంటున్నదని, వాస్తవానికి వారిది డబుల్ ఇంజన్ కాదు.. బుల్డోజర్ సర్కార్ అని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యురాలు బృందాకారత్ ఎద్దేవా చేశారు. పేదల ఇండ్లను బుల్ డోజర్లతో కూల్చడం డబుల్ ఇంజిన్ సర్కారు విధానమా అని ఆమె ప్రశ్నించారు. దేశంలో కొన్ని ప్రాంతీయ పార్టీలపై బీజేపీ కావాలని దాడులు చేయిస్తున్నదని విమర్శించారు. ఆదివారం మహబూబాబాద్లో తెలంగాణ ప్రజాసంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బస్సు జాతాను ఆమె ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు.
అనంతరం బైపాస్లో సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగసభలో బృందాకారత్ మాట్లాడారు. మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నిరుపేదల సంక్షేమం కోసం ఏ ఒక్క పథకాన్ని అమలు చేయలేదని విమర్శించారు. ప్రభుత్వ సాయం అందక దేశంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలంతా నానా అవస్థలు పడుతున్నారని చెప్పారు. కార్పొరేట్, పెట్టుబడిదారులకు అండగా ఉండి సామాన్యులను దోచుకుంటున్నారని మండిపడ్డారు. దేశంలో పేదలు ఇండ్లు లేక ఇబ్బందులు పడుతున్నారని, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిరుపేదలకు వెంటనే ఇండ్లు కట్టించేలా కేంద్రం చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తెలంగాణలో మత విద్వేషాలను రెచ్చగొడుతున్న బీజేపీని సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు ఎండగడుతున్నారని పేర్కొన్నారు. బీజేపీ ప్రజావ్యతిరేక విధానాలకు ప్రజలంతా ఐక్యంగా ఉండి తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తెలంగాణ ప్రజాసంఘాల పోరాట వేదిక రాష్ట్ర కన్వీనర్ ఎస్ వీరయ్య, టీ సాగర్, మల్లు లక్ష్మీ, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జీ నాగయ్య తదితరులు పాల్గొన్నారు.