Sunkishala | సుంకిశాల సైడ్వాల్ కూలిన ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని, అందుకు బాధ్యులైన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని సీఎంఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. సుంకిశాల ప్రాజెక్టు రిటైనింగ్ వాల్ కూలిన ప్రాంతాన్ని సీపీఎం ప్రతినిధి బృందం పరిశీలించింది. నిర్మాణ పనులు చేస్తున్న మెగా ఇంజినీరింగ్ కన్స్ట్రక్షన్ కంపెనీ కాలపరిమితిలో నిర్మాణం పూర్తి చేయకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం ఈ ప్రాజెక్టుపై జరుగుతున్న పనులను పర్యవేక్షించడం లేదన్నారు. కూలిపోయిన సమయంలో పనిచేసే వారు లేకపోవడంతో ప్రాణనష్టం జరుగలేదన్నారు.
పర్వేదుల నుంచి సుంకిశాల ప్రాజెక్టు వరకు రోడ్డు అధ్వాన్నంగా ఉందని.. రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ పనులు కూడా చేయలేదన్నారు. నిర్మాణం చేస్తున్న సంస్థ కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదని, వరదలు పైనుంచి వస్తున్నప్పుడు సిమెంట్ పనులు చేయడం, సరిగా క్యూరింగ్ కాలేదన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం జరుగుతున్న పనులపై నిరంతరం పర్యవేక్షణ పెట్టి త్వరగా పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని సీపీఐ(ఎం) ప్రతినిధి బృందం ప్రభుత్వాన్ని కోరింది.
ఈ ప్రతినిధి బృందంలో సీపీఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, నాయకులు బండా శ్రీశైలం, కూనురెడ్డి నాగిరెడ్డి, చిన్నపాక లక్ష్మీనారాయణ, మహమ్మద్ సలీం, పీ నర్సిరెడ్డి, దండంపల్లి సత్తయ్య, షేక్ బషీర్, పూల సత్యనారాయణ, దుబ్బ రామచంద్రం, బాపురెడ్డి ఉన్నారు.