సంగారెడ్డి అర్బన్, సెప్టెంబర్ 17: తెలంగాణ గడ్డపై కాషాయ పార్టీ విభజన రాజకీయాలు చెల్లవని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమంపై కాకుండా మత విద్వేషాలు రెచ్చగొడుతూ బీజేపీ చిచ్చుపెట్చే ప్రయత్నం చేస్తున్నదని మండిపడ్డారు. సీపీఎం ఆధ్వర్యంలో శనివారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాల ముగింపు సభ జరిగింది. ఈ సభకు హాజరైన తమ్మినేని మాట్లాడుతూ.. నిజాం పాలనకు వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో బీజేపీ, ఆ పార్టీ పూర్వీకుల జాడే లేదని స్పష్టం చేశారు. రాజకీయ లబ్ధి కోసమే తెలంగాణ విమోచన దినం పేరుతో బీజేపీ వేడుకలు జరుపుతున్నదని విమర్శించారు. మత విద్వేషాలు, నిరంకుశ పాలన కొనసాగిస్తున్న బీజేపీని తెలంగాణలో అధికారంలోకి రానివ్వబోమని శపథం చేశారు. మునుగోడు ఎన్నికల్లో టీఆర్ఎస్కు సంపూర్ణ మద్దతిచ్చామని పునరుద్ఘాటించారు. నెల రోజుల్లో తెలంగాణ ప్రభుత్వం కూలిపోతుందని స్వయంగా కేంద్ర హోం మంత్రి అమిత్షా ప్రకటించడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. దేశాభివృద్ధి, ప్రజాసంక్షేమం, నిరుద్యోగం, పెరిగిన ధరలపై మాట్లాడకుండా మసీదులు కూలుస్తామని మాట్లాడటం వారి అధికార దురహంకారానికి చిహ్నమని మండిపడ్డారు. టీఆర్ఎస్ జాతీయ పార్టీ పెట్టడంలో తప్పేముందని ప్రశ్నించారు. విదేశాల్లోని నల్లధనాన్ని తెచ్చి ఇంటింటికీ రూ.15 లక్షలు పంచుతామని, ఏటా 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న బీజేపీ హామీ ఏమైందని ప్రశ్నించారు. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు.