హైదరాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ): ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చాక తెలంగాణకు ఏమిచ్చారో చెప్పాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఒక ప్రకటనలో ప్రశ్నించారు. ప్రధాని పర్యటనను వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా శనివారం సీపీఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు తెలిపారు. విభజన హామీలు, వాటాలతో పాటు వివిధ సందర్భాల్లో ప్రధాని ఇచ్చిన హామీలపై కేంద్రం నిర్లక్ష్యం చేస్తూ వచ్చిందని విమర్శించారు. బయ్యారం ఉకు, గిరిజన, హార్టికల్చర్ యూనివర్సిటీలు, ఎన్టీపీసీ విద్యుత్ కేంద్రం, ఖాజీపేట రైల్వేకోచ్ ప్యాక్టరీ ఏమయ్యాయని ప్రశ్నించారు. సింగరేణిని ప్రైవేటుపరం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. యూపీఏ హయాంలో మంజూరైన ఐటీఐఆర్ను రద్దు చేసింది మీరు కాదా? అని నిలదీశారు. గిరిజన, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిని ప్రధాని ఏనా డూ పట్టించుకోలేదని ఆరోపించారు. వీటి పర్యవసానంగా ప్రధానికి తెలంగాణలో పర్యటించే హక్కే లేదని స్పష్టం చేశారు.