భువనగిరి కలెక్టరేట్, ఆగస్టు 21: దేశాన్ని అమ్ముకొంటున్న మోదీ పాలనకు వ్యతిరేకంగా ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు వెంటే ఉంటామని.. మునుగోడులో బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి బీజేపీ చేతిలో కీలుబొమ్మలా మారారని విమర్శించారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా అనాజిపురంలో సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్ తరఫున మునుగోడులో గెలిచి నాలుగేండ్లు పదవిని అనుభవించిన రాజగోపాల్రెడ్డి ఏ ప్రయోజనం కోసం ఇప్పుడు రాజీనామా చేశారని ప్రశ్నించారు. ఆయన రాజీనామా వెనుక బీజేపీ రాజకీయ కుట్ర దాగి ఉన్నదని ఆరోపించారు. మతతత్వ పార్టీ బీజేపీని దేశం నుంచి తరిమికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాష్ర్టాల హక్కులను కాలరాస్తున్నదని మండిపడ్డారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రజాసంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని అభినందించారు. ప్రభుత్వ సంస్థలను కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేయడంతోపాటు జీఎస్టీ పేరుతో సామాన్యులపై భారాన్ని మోపుతున్నారని కేంద్రం తీరుపై మండిపడ్డారు. మునుగోడు ఎన్నికల్లో టీఆర్ఎస్కు సీపీఐ మద్దతును ప్రకటించడం శుభపరిణామమని, త్వరలో తమ పార్టీ నిర్ణయాన్ని ప్రకటిస్తామని చెప్పారు.