హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తున్నదని సీపీఎం నేత, త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ ధ్వజమెత్తారు. పేదలకు విద్యను దూరం చేసి కార్పొరేట్ శక్తులకు సంపదలు కట్టబెడుతున్నదని మండిపడ్డారు. విశ్వవిద్యాలయాల్లోకి ఆర్ఎస్ఎస్ శక్తులు ప్రవేశించి విద్యార్థి సంఘాల నాయకులపై దాడులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎస్ఎఫ్ఐ 17వ జాతీయ మహాసభల సందర్భంగా సోమవారం హైదరాబాద్ పీపుల్స్ ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాణిక్ సర్కార్ ప్రసంగించారు. బీజేపీ తీసుకొచ్చిన నూతన విద్యావిధానం స్వార్థం, విభజన తత్వాన్ని పెంపొందిస్తుందని ఆరోపించారు. స్వాతంత్య్ర పోరాట చరిత్రను కేంద్రంలోని బీజేపీ సర్కార్ వక్రీకరిస్తున్నదని విరుచుకుపడ్డారు. దేశ ప్రయోజాలకు భిన్నంగా ఆర్ఎస్ఎస్ చెప్పుచేతల్లో బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని దుయ్యబట్టారు. జాతీయ నూతన విద్యావిధానానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఉద్యమం చేపట్టాలని పిలుపునిచ్చారు. దేశంలో నిరుద్యోగ సమస్య భయంకరంగా ఉన్నదని, కనీసం ఖాళీగా ఉన్న ఉద్యోగాలను కూడా భర్తీ చేయడం లేదని ధ్వజమెత్తారు.సభలో ఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు వీపీ సానూ, ప్రధాన కార్యదర్శులు మయూక్ బిశ్వాస్, రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎల్ మూర్తి తదితరులు హాజరయ్యారు.