CPM | హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ): భువనగిరి లోక్సభ స్థానం నుంచి సీపీఎం పోటీ చేస్తున్నదని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. మిగిలిన స్థానాల్లో బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. హైదరాబాద్లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీజేపీ బలపడకుండా అడ్డుకొనేందుకు కాంగ్రెస్తో కలిసి వామపక్షాలు పనిచేయాలని భావించాయని, కానీ ఆ పార్టీ నుంచి పొత్తు ప్రతిపాదనపై చర్చలు జరగలేదని చెప్పారు.
లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బీజేపీ గెలుపును అడ్డుకోవడమే సీపీఎం లక్ష్యమని తెలిపారు. బీజేపీ మరోసారి కేంద్రంలో అధికారంలోకి వస్తే అరాచకం మరింత పేట్రేగిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా వామపక్షాలు పనిచేయాలని నిర్ణయించామని చెప్పారు.