నమస్తే తెలంగాణ నెట్వర్క్, డిసెంబర్ 10: సింగరేణిలోని నాలుగు బొగ్గు బ్లాకుల వేలాన్ని రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ టీబీజీకేఎస్తోపాటు జాతీయ సంఘాలు చేపట్టిన సింగరేణి బంద్ రెండోరోజు కొనసాగింది. బంద్ కారణంగా రాష్ట్రంలోని 11 ఏరియాల్లో శుక్రవారం ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. ప్రీ షిప్టు నుంచి అన్ని భూగర్భ గనులు, ఓపెన్కాస్టు గనులు, డిపార్ట్మెంట్ల కార్యాలయాలతోపాటు కొత్తగూడెం కార్పొరేట్ కార్యాలయం ఎదుట కార్మికులు ధర్నా చేపట్టారు. రెండో రోజూ బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచి పోవడంతో యాజమాన్యానికి రూ.60 కోట్ల నష్టం వాటిల్లింది. కార్మికులు సైతం వేతనాల రూపంలో రూ.18 కోట్లు కోల్పోయారు. 11 ఏరియాల్లో రెండో రోజు సమ్మెలో మొదటి, రెండు షిప్టులు కలిపి కేవలం 15.69 శాతం మంది కార్మికులు మాత్రమే హాజరయ్యారు. రెండోరోజు హైదరాబాద్లో టీబీజీకేఎస్ నాయకులు, అఖిల పక్ష నాయకులు రీజినల్ లేబర్ కమిషన్ (ఆర్ఎల్సీ)తో జరిపిన చర్చలు విఫలమాయ్యయి. దీంతో మూడో రోజు శనివారమూ సమ్మె కొనసాగనున్నది. రెండోరోజు సింగరేణి వ్యాప్తంగా 16,242.51 టన్నుల బొగ్గు ఉత్పత్తి చేశామని, 9,471.90 టన్నుల బొగ్గు రవాణా చేసినట్లు అధికారులు ప్రకటించారు.
కేంద్రం విధానాలపై పోరాటం: మంత్రి కొప్పుల
సింగరేణికి చెందిన నాలుగు బొగ్గు బ్లాకులను అడ్రస్, అనుభవం లేని వ్యక్తులకు కేంద్రం అమ్మేసేందుకు చేస్తున్న ప్రయత్నాలను తెలంగాణ ప్రభుత్వం, కార్మిక వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సింగరేణి జీడీకే-2 గని వద్దకు శుక్రవారం పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేతకాని, ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, దాసరి మనోహర్రెడ్డితో కలిసి వచ్చారు. సమ్మెకు సంఘీభావం ప్రకటించారు. సింగరేణి బొగ్గుపై తెలంగాణకే పూర్తి హక్కు ఉన్నదని స్పష్టంచేశారు. సింగరేణి నాలుగు బొగ్గు బ్లాకులను వేలం ద్వారా అమ్మేసే చర్యలను టీఆర్ఎస్ ఎంపీలంతా ముక్తకంఠంతో ఖండిస్తున్నారని పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేతకాని పేర్కొన్నారు. బొగ్గు బ్లాకుల వేలాన్ని రద్దు చేసే దాకా తెలంగాణ ఉద్యమ తరహాలో పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నదని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పేర్కొన్నారు.
సమ్మెకు సీపీఎం సంపూర్ణ మద్దతు: తమ్మినేని
సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణను నిరసిస్తూ కార్మికులు చేస్తున్న సమ్మెకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం గనుల ప్రైవేటీకరణను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులు రికార్డు స్థాయిలో బొగ్గు ఉత్పత్తి చేసి సింగరేణిని లాభాల బాటలో నడిపిస్తున్నా, కేంద్రం ఏకపక్షంగా సంస్థను కార్పొరేట్లకు ధారాదత్తం చేయడాన్ని ఖండించారు. పోరాటంతో ప్రైవేటీకరణ ప్రయత్నాలను కార్మికులు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.