హైదరాబాద్/జనగామ చౌరస్తా, మార్చి 23 (నమస్తే తెలంగాణ): కేంద్రం నిరంకుశ విధానాలపై పోరాడుతున్న సీఎం కేసీఆర్కు సీపీఎం సంపూర్ణ మద్దతు ప్రకటించింది. తెలంగాణ పట్ల మోదీ సర్కారు చూపుతున్న వివక్షను ఎండగట్టేందుకు రాష్ట్ర మంత్రుల బృందం ఢిల్లీలో ధర్నాలు చేయడాన్ని స్వాగతిస్తున్నామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. బుధవారం జనగామలో నిర్వహించిన సీపీఎం జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ విధానాలపై టీఆర్ఎస్తోపాటు రాష్ట్రంలోని పార్టీలన్నీ కలిసి పోరాడితే బాగుంటుందని సూచించారు. సీఎం కేసీఆర్ ఆహ్వానిస్తే కేంద్రానికి వ్యతిరేకంగా సీపీఎం కూడా నిరసనల్లో పాల్గొంటుందని తెలిపారు. బల్క్ డీజిల్ ధరలను భారీగా పెంచడాన్ని సీపీఎం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదని చెప్పారు. డీజిల్ రేట్ల ప్రభావం నిత్యావసరాల ధరలపై పడుతుందని ఆందోళన వ్యక్తంచేశారు.