నల్లగొండ: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా తెలంగాణలో మార్చి 18 నుంచి బస్సు యాత్ర నిర్వహిస్తున్నట్లు సీపీఎం(cpm) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి తెలిపారు.నరేంద్ర మోదీ ప్రభుత్వం(Modi Government) అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజల సంక్షేమ పథకాలను గాలికి వదిలేసి పెట్టుబడిదారులు, కార్పొరేట్ శక్తులకు అనుగుణంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
ఇతర దేశాల్లో దోచిపెట్టిన నల్లధనాన్ని(Block money) తీసుకొస్తానని ఇచ్చిన హామీని మర్చిపోయి తిరిగి రూ.14 లక్షల కోట్ల రాయితీని బడా పెట్టుబడిదారులకు ఇవ్వడం సిగ్గుచేటని అన్నారు. ఉపాధి హామీ పథకానికి భారీగా నిధులు తగ్గించడం దుర్మార్గమని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ కన్నుసన్నలలో నడుస్తుందని, హిందుత్వ పేరుతో రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు. గుజరాత్లో ఏడుసార్లు అధికారంలోకి వచ్చినా కాని అక్షరాసత్యలో ఆ రాష్ట్రం ఇంకా వెనకబడి ఉందని ఆరోపించారు.
అధికారంలోకి రావడానికి ఇతర రాజకీయ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేయడం బీజేపీకి పరిపాటిగా మారిందని విమర్శించారు. మతోన్మాద ఆర్ఎస్ఎస్, బీజేపీ రాజకీయాలను ఓడించాల్సిన అవసరం కమ్యూనిస్టు పార్టీలకు, ప్రజాతంత్ర శక్తులకు ఉందని అన్నారు. బస్సు యాత్రలో గ్రామ గ్రామాన బీజేపీ విధానాలను ఎండగడుతూ ప్రచారం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
మార్చి 1న మిర్యాలగూడలో జరిగే భారీ బహిరంగ సభకు అఖిలభారత నాయకురాలు, మాజీ పార్లమెంట్ సభ్యురాలు బృందాకరత్, ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యులు తమ్మినేని వీరభద్రం తదితరులు హాజరవుతున్నారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు నారి ఐలయ్య బండ శ్రీశైలం పాలడుగు నాగార్జున నాగిరెడ్డి, సిహెచ్ లక్ష్మీనారాయణ కందాల ప్రమీల పాలడుగు ప్రభావతి తదితరులు పాల్గొన్నారు.