Telangana | హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్తో వామపక్షాల పొత్తు బెడిసికొట్టినట్టు తెలుస్తున్నది. వామపక్షాలు తాము కోరిన సీట్లపై కాంగ్రెస్కు విధించిన గడువు బుధవారంతో ముగిసింది. అయినప్పటికీ కాంగ్రెస్ నుంచి ఎలాంటి స్పందన కనిపించలేదు. ఈ నేపథ్యంలో సీపీఐ, సీపీఎం బుధవారం వేర్వేరుగా రాష్ట్ర కార్యవర్గ సమావేశాలను నిర్వహించాయి. తాము కోరిన మిర్యాలగూడ, వైరా స్థానాలపై కాంగ్రెస్ ఎటువంటి హామీ ఇవ్వకపోవడంతో ఒంటిపోరుకు వెళ్లాలని నిర్ణయించిన సీపీఎం.. 15 స్థానాల్లో పోటీ చేయాలని తీర్మానించింది.
ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో 9 స్థానాలతోపాటు ఇబ్రహీంపట్నంలోనూ బరిలో ఉండాలని నిర్ణయించింది. ఇవి కాకుండా మరో ఐదు స్థానాలను గుర్తించి మొత్తం 15 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాలని యోచిస్తున్నట్టు తెలిసింది. కాంగ్రెస్తో పొత్తు ఉండేదీ, లేనిదీ గురువారం ప్రకటిస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు.
ఎటూ తేల్చుకోని సీపీఐ
ఒంటరి పోరుకు వెళ్లాలని సీపీఎం నిర్ణయించగా సీపీఐ మాత్రం ఇంకా ఎటూ తేల్చుకోలేకపోతున్నది. ఒకవేళ సీపీఐతో కూడా కాంగ్రెస్ పొత్తు కుదరకుంటే లెఫ్ట్ పార్టీలు ఉమ్మడిగా బరిలోకి దిగే అవకాశం ఉంది. తాము అడిగిన సీట్లు ఇస్తారన్న నమ్మకం ఉన్నదని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా చెప్పారు. సీట్ల కేటాయింపుపై ఇంకా చర్చలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ మాట నిలబెట్టుకుంటుందని భావిస్తున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు.