హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): బీజేపీని ఎదుర్కొనే సత్తా టీఆర్ఎస్కు ఉన్నదని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ అన్నారు. బీజేపీని అడ్డుకొనేందుకే మునుగోడులో టీఆర్ఎస్కు మద్దతు ఇస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం బీజేపీని ఎదుర్కొనే స్థితిలో కాంగ్రెస్ లేదని పేర్కొన్నారు. ఆదివారం ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకత మొదలైందని చెప్పారు.
దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకతాటిపైకి తెచ్చేందుకు సీపీఐ కృషి చేస్తున్నదని, అందులో భాగంగానే టీఆర్ఎస్కు మద్దతు ఇస్తున్నదని వివరించారు. ఆంధ్రప్రదేశ్లోని పార్టీలు మాత్రం బీజేపీతో అంటకాగుతున్నాయని విమర్శించారు. మోదీ షేక్హ్యాండ్ ఇస్తేనే చంద్రబాబు మురిసిపోతున్నారని ఎద్దేవా చేశారు. కేంద్రంలోని బీజేపీ తమను వ్యతిరేకిస్తున్న తొమ్మిది రాష్ట్ర ప్రభుత్వాలను అనైతిక పద్ధతుల్లో కూల్చేసిందని దుయ్యబట్టారు.