హైదరాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ): ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనపై శనివారం రాష్ట్ర వ్యాప్తంగా సీపీఐ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించనున్నట్టు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఒక ప్రకటనలో తెలిపారు. నల్లబ్యాడ్జీలు ధరించి అంబేద్కర్ విగ్రహాల వద్ద నల్లజెండాలతో ప్రదర్శనలు నిర్వహిస్తామని తెలిపారు.
రాష్ట్ర విభజన హామీలు నెరవేర్చని ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణలో అడుగుపెట్టే నైతిక హక్కు లేదని విమర్శించారు. తొమ్మిదేండ్లపాటు తెలంగాణకు ఏ ఒక్క పని చేయని మోదీ తీరని అన్యాయం చేశారని విమర్శించారు. గతంలో సింగరేణిని ప్రైవేటీకరించబోమని ప్రధాని ప్రకటించారని, కానీ మళ్లీ టెండర్లు పిలిచి తన హామీలే అబద్ధాలని నిరూపించుకున్నారని ధ్వజమెత్తారు. కార్మికులు కొట్లాడి తెచ్చుకున్న హకులను మోదీ కాలరాస్తున్నారని విమర్శించారు. అదానీ లాంటి అవినీతిపరులకు ప్రధాని అండగా నిలుస్తున్నారని ఆరోపించారు.