హైదరాబాద్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): భారతదేశాన్ని బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఎల్లకాలం పరిపాలించలేవని, వచ్చే 2024 సంవత్సరంలో జరిగే సాధారణ ఎన్నికల్లో మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా అన్నారు. ఇందుకు ప్రజాస్వామ్య, లౌకిక, వామపక్ష శక్తులను కూడగడతామని తెలిపారు. బీజేపీని వ్యతిరేకించే పార్టీలతో సీపీఐ కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నదని అన్నారు. విజయవాడలో సీపీఐ 24వ జాతీయ మహాసభల ప్రారంభ సూచనగా శుక్రవారం భారీ ర్యాలీ అనంతరం కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు మైదానం (ఎంబీ స్టేడియం)లో భారీ బహిరంగ సభ జరిగింది.
సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సభలో రాజా మాట్లాడుతూ, మహాసభల రోజు డాక్టర్ సాయిబాబాను నిర్దోషిగా ముంబై హైకోర్టు ప్రకటించడం ముదావహమన్నారు. సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ మాట్లాడుతూ దేశాన్ని గుజరాత్ గూండాలు పరిపాలిస్తున్నారని, ఆదానీ స్మగ్లింగ్ వ్యాపారంతో ఆర్థికంగా ఎదిగిపోయారన్నారు. అంతకుముందు వేదిక ముందు బతుకమ్మ ఆడారు. మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి, జాతీయ కార్యదర్శివర్గ సభ్యులు అతుల్కుమార్ అంజన్, అమర్జీత్ కౌర్, కానం రాజేందర్ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్రెడ్డి, సయ్యద్ అజీజ్పాషా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకట్ రెడ్డి, ఇతర జాతీయ నాయకులు వేదికపై ఆసీనులయ్యారు.