హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): దేశంలోనే తొలిసారిగా నూతన సచివాలయానికి అంబేదర్ పేరు పెట్టిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకు సీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి అభినందనలు తెలిపారు. అంబేదర్ అతిపెద్ద విగ్రహాన్ని జ్ఞాన విగ్రహంగా ప్రతిష్ఠించడం ప్రశంసనీయమని పేర్కొన్నారు. ప్రతి ఒకరూ అంబేద్కర్ బోధనలను అనుసరించాలని గుర్తుచేస్తున్నట్టుగా విగ్రహం ఉన్నదని తెలిపారు.
ఈ మేరకు సురవరం ఆదివారం సీఎం కేసీఆర్కు లేఖ రాశారు. రాష్ట్రంలో ప్రతి కులానికి ఆత్మగౌరవ భవన నిర్మాణాల కోసం భూమి, నిధులను కేటాయించడం, పేద పిల్లల వివాహానికి ఆర్థిక సహాయం అందించడాన్ని సురవరం ప్రశంసించారు. కులాంతర వివాహాలు చేసుకున్న దళితులకు రూ.2 లక్షల ఆర్థిక సాయం, డబుల్బెడ్రూం ఇల్లు, ఉద్యోగాల్లో 1 శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరారు. అంబేద్కర్ పుస్తకాలు విస్తృతంగా అందుబాటులో ఉండేలా చూడాలని విజ్ఞప్తిచేశారు.