యాదాద్రి భువనగిరి : రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షణకై మతోన్మాద బీజేపీకి తెలంగాణలో అడ్డుకట్ట వేయడమే కమ్యూనిస్టుల కర్తవ్యం అని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి అన్నారు. మంగళవారం భువనగిరి పట్టణం, రాయగిరిలో భారత కమ్యూనిస్టు పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా 3వ మహాసభలను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఎలాంటి పాత్ర పోషించని బీజేపీ నాయకులు అధికారంలోకి వస్తే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని చెప్పడం సిగ్గుచేటుగా ఉందన్నారు. నిజాం రజాకార్ల అకృత్యాలకు, దొరల దురాగాతలకు ఎదిరొడ్డి భూస్వామ్య పరిపాలనకు చరమగీతం పాడేందుకు నిర్వహించిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో 4500 మంది కమ్యూనిస్టులు అమరవీరులయ్యారని, సాయుధ పోరాటం 4 వేల గ్రామాలను విముక్తి చేయడంతో పాటు 10 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచిన ఉద్యమ చరిత్రను బీజేపీ వక్రీకరించేందుకు చేస్తున్న కుట్రలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని హిందూ ముస్లింల మధ్య జరిగిన గొడవగా బీజేపీ చిత్రీకరించే ప్రయత్నం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. దేశ స్వాతంత్ర సంగ్రామ చరిత్రను సైతం బీజేపీ వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నదని మండిపడ్డారు.
ప్రజలకు అచ్చే దిన్ తీసుకువస్తానని అధికారంలోకి వచ్చిన మోదీ ప్రజలకు సచ్చేదిన్ తీసుకువచ్చి కార్పొరేట్ శక్తులకు మాత్రం మంచి రోజులు తీసుకువచ్చారని విమర్శించారు. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలోని సంపన్నులకు రూ. 12 లక్షల కోట్ల బకాయిలను రద్దు చేశారని, పేదలకు ఇచ్చే ఉచితాలను ప్రభుత్వ ఖజానాకు భారమని చర్చకు తెరలేపి దేశంలో సంక్షేమ పథకాలు లేకుండా చేయాలని బీజేపీ చూస్తున్నదని మండిపడ్డారు. ఆయా రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలను రాత్రికి రాత్రి కొనుగోలు చేస్తూ ప్రభుత్వాలను మార్చి ప్రజాస్వామ్యాన్ని అభాసుపాలు చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశాన్ని నాశనం చేస్తున్న బీజేపీని పారద్రోలడానికి కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో ఉద్యమించాల్సిన అవసరం ఉందని చెప్పారు.
మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి అత్యధిక మెజార్టీతో గెలుపొందుతారని పల్లా వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. మునుగోడు శాసనసభకు సీపీఐ ఐదు సార్లు ప్రాతినిధ్యం వహించిందని, తమకు అన్ని గ్రామాల్లో ఓటు బ్యాంకు ఉందన్నారు. 25 వేలకు పైగా ఉన్న తమ ఓటు బ్యాంకు టీఆర్ఎస్ అభ్యర్థికి అనుకూలంగా మారడం వల్ల ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు నల్లేరుపై నడకేనని వివరించారు. బీజేపీ ఎన్ని డబ్బులు పంచినా, ఎన్ని కుట్రలు చేసినా మునుగోడులో గెలవడం కష్టమన్నారు.