హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రాన్ని అష్టకష్టాల పాలు చేసిన ప్రధానమంత్రి నరేంద్రమోదీకి రాష్ట్రానికి వచ్చే నైతిక హక్కు లేదని, వస్తే తాము అడ్డుకుంటామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు హెచ్చరించారు. మోదీకి ఏమాత్రం ఆత్మాభిమానం ఉన్నా, తెలంగాణ పర్యాటనను రద్దు చేసుకోవాలని, లేదంటే అవమానాలను ఎదుర్కొవాల్సి వస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని, తెలుగు ప్రజలను అవమానపర్చేలా వ్యాఖ్యలు చేసిన గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ తక్షణమే తెలంగాణను వదిలి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. బ్రిటీష్ కాలం నాటి గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలన్నారు. హైదరాబాద్ మగ్దుం భవన్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కూనంనేని సాంబశివరావు మాట్లాడారు.
ఈ నెల 12న మోదీ రాష్ట్ర పర్యటనను నిరసిస్తూ సింగరేణి ప్రాంత జిల్లాలో ఈ నెల 10వ తేదీ నుండి ఆందోళన కార్యక్రమాలను చేపడుతామన్నారు. ప్రధాని పర్యటనను అడ్డుకుంటామని, అవసరమైతే జైలుకు వెళ్లేందుకైనా సిద్ధమేనన్నారు. బయ్యారం ఉకు ఫ్యాక్టరీ, కాజీపేట కోచ్, గిరిజన యూనివర్సిటీ ఇలా ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టలోంలోని ఏ ఒక్క హామీనైనా కేంద్రం అమలు చేసిందా అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసిందని నిలదీశారు. భద్రాచలం నియోజకవర్గంలో ఐదు గ్రామాలను వెనకి ఇవ్వలేదన్నారు. మోదీకి తెలంగాణ రాష్ట్రం అంటేనే కోపమని, రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఎందుకు ఇవ్వడం లేదని కూనంనేని ప్రశ్నించారు. తెలంగాణకు న్యాయం జరిగే వరకు ఈ గడ్డపైకి మోదీ రావొద్దు. రామగుండంలోని ఎరువుల ఫ్యాక్టరీ పునః ప్రారంభానికి ముఖ్యమంత్రి కేసీఆర్ని ఆహ్వానించాలనే కనీస మర్యాద, గౌరవం కూడా ప్రధానికి లేదన్నారు. పరాయి పాలకులు వచ్చి దేశాన్ని మింగినట్టుగానే ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలను బీజేపీ ప్రభుత్వం మింగడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. సింగరేణి సంస్థ ప్రైవేటీకరణ చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని, ఎలాంటి త్యాగానికైనా సిద్ధమేనని తెలిపారు. కేంద్రంపైన పోరాటం చేసే క్రమంలో తమపై దేశద్రోహం లాంటి ఏ కేసులు పెడుతారో తెలియదని, కానీ ఏ కేసులు పెట్టినా తాము ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాటం చేస్తామన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా, సమాజానికి మంచి చేసే వారితో తమ స్నేహ హస్తం ఉంటుందని, చివరకు కాంగ్రెస్ వచ్చినా కలుపుకుంటామని, తమకు ప్రధాన శత్రువు బీజేపీ అని కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు.
తమిళి సై గవర్నరా? లేదా బీజేపీ కార్యకర్తనా తేల్చుకోవాలని సూచించారు. 8 బిల్లులలో కొన్ని మంచి బిల్లులు కూడా ఉన్నాయని, ఏమైనా అభ్యంతరాలు, అనుమానాలు ఉంటే వెనక్కి పంపించాలని, కానీ మంత్రులు వచ్చి రాయబారాలు జరిపితేనే, లొంగిపోతేనే ఆమోదిస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం, ప్రభుత్వాలను కూలగొట్టేదే గవర్నర్లు అని కూనంనేని విమర్శించారు.