హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తన నోరు అదుపులో పెట్టుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఆయన నోరు యాసిడ్ పోసి కడిగినా బాగుపడదని మండిపడ్డారు. బీజేపీ సమాజానికి పట్టిన చీడ అయితే, దానికి పట్టిన పీడ బండి సంజయ్ అని ధ్వజమెత్తారు. రాజకీయ సంసారం లేకుండా నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారని విమర్శించారు. ఖమ్మం జిల్లాకు రాగానే పూనకం వచ్చినట్టు మాట్లాడటం తగదని, ఈ జిల్లా ప్రజలు బీజేపీని దరిచేనివ్వరని స్పష్టం చేశారు.
ఖమ్మం జిల్లాలో కమ్యూనిస్టుల పని అయిపోయిందని పిచ్చివాడిలాగా అవాకులు, చెవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. కమ్యూనిస్టు పార్టీలు ఓట్లు, సీట్ల కోసం ఏనాడూ తహతహలాడలేదని, బీజేపీ లాగా అడ్డమైన పనులకు పాల్పడబోవని తెలిపారు. ఖమ్మంలో నిరుద్యోగ మార్చ్ చేయడం కాదని, చేతనైతే ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని విఫలమైనందుకు ఢిల్లీలోని ప్రధాని నరేంద్రమోదీ నివాసం వద్ద చేయాలని హితవు చెప్పారు. ఇప్పుడున్న స్థానాలు కూడా బీజేపీకి రావని, బండి సంజయ్ లోక్సభ స్థానం కూడా తిరిగి గెలిచే పరిస్థితి లేదని తేల్చిచెప్పారు.