హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ): ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మహిళా రెజ్లర్లపై పోలీసుల దాడి, అక్రమ అరెస్టులకు బాధ్యత వహిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ క్షమాపణ చెప్పాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ బ్రిజ్భూషణ్సింగ్ను వెంటనే అరెస్టు చేయాలని కోరారు. హైదరాబాద్లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడారు.
దేశం గర్వించేలా ఎన్నో పతకాలు గెలిచి కీర్తిని సంపాదించి పెట్టిన క్రీడాకారులు గత 35 రోజులుగా ఆందోళన చేస్తున్నారని తెలిపారు. చీఫ్ కోచ్గా ఉన్న ఎంపీ బ్రిజ్భూషణ్సింగ్ తమపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ఆందోళన కొనసాగిస్తున్నారని, దీనిపై దేశవ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ఇప్పటికీ బాధ్యుడైన ఆ ఎంపీని అరెస్టు చేయకపోవడం మహిళల పట్ల బీజేపీకి ఉన్న వైఖరికి అద్దం పడుతున్నదని విమర్శించారు. ఒకవైపు నూతన పార్లమెంట్ ప్రారంభోత్సవం జరుపుకుంటూ, ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఆందోళన చేస్తున్న మహిళా రెజ్లర్లపై అరాచక పద్ధతుల్లో దాడి చేయడం అత్యంత అమానుషమని ఆరోపించారు.