హైదరాబాద్, జూన్ 26(నమస్తే తెలంగాణ): దేశంలో కుల, మతాల పేరిట జరుగుతున్న విభజన రాజకీయాలను విద్యార్థులు ప్రతిఘటించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు. మేడ్చల్-మలాజిగిరి జిల్లా బోడుప్పల్లో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి విద్యా, వైజ్ఞానిక, సైద్ధాంతిక, రాజకీయ శిక్షణ తరగతులు సోమవారం ప్రారంభమయ్యాయి. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మణికంఠరెడ్డి అధ్యక్షతన జరిగిన ప్రారంభోత్సవ సభలో కూనంనేని మాట్లాడారు. విద్యార్థులు పాఠ్య పుస్తకాలతోపాటు, సమాజాన్ని కూడా చదివి, అనేక రుగ్మతలపై పోరాడాలని సూచించారు.
దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తున్నదని, కవులు, కళాకారులు, రచయితలపై, ప్రజ ల తరఫున మాట్లాడే వారిపై కేసులు పెట్టి వేధిస్తున్నారని విమర్శించారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు మాదాల రవి మాట్లాడుతూ విద్యార్థులు నిరంతరం చదువుతూ ప్రశ్నించేతత్వాన్ని అలవర్చుకోవాలని కోరారు. కార్యక్రమంలో సీపీఐ మేడ్చల్-మలాజిగిరి జిల్లా కార్యదర్శి సాయిలుగౌడ్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర మాజీ కార్యదర్శి బాలమల్లేశ్, జాతీయ కార్యవర్గ సభ్యుడు ఎన్ అశోక్ స్టాలిన్, రాష్ట్ర పూర్వ సహాయ కార్యదర్శి ఇ ఉమామహేశ్, రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.