హైదరాబాద్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ): ప్రధాని మోదీ అండదండలతోనే అదానీ కంపెనీలు అక్రమాలకు పాల్పడ్డాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆగ్రహం వ్యక్తంచేశారు. అదానీ వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)తో విచారణ జరిపించడానికి ప్రధాని మోదీకి భయమెందుకని ప్రశ్నించారు. జేపీసీలో బీజేపీ ఎంపీలు కూడా ఉంటారని, మోదీ తప్పు చేయకుంటే జేపీసీని వేయడానికి ఎందుకు వెనుకాడుతున్నారని నిలదీశారు. అదానీ కంపెనీ కుంభకోణాలపై జేపీసీ వేయాలని, తక్షణమే అదానీని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ జాతీయ సమితి ఇచ్చిన పిలుపులో భాగంగా సోమవారం రాష్ట్రంలో పలుచోట్ల ఆందోళనలు నిర్వహించారు. హైదరాబాద్లోని ఆర్బీఐ కార్యాలయం ఎదుట నిర్వహించిన కార్యక్రమంలో కూనంనేని మాట్లాడుతూ.. అదానీ ఆర్థిక సామ్రాజ్యం గాలిబుడగ లాంటిదని, అది అవినీతి పునాదులపై నిర్మించినదని విమర్శించారు. మోదీ కనుసన్నల్లోనే ఎల్ఐసీ నుంచి రూ.80 వేల కోట్లు, ఎస్బీఐ నుంచి రూ.25 వేల కోట్ల పెట్టుబడులు అదానీ కంపెనీల్లో పెట్టారని ఆరోపించారు. ప్రజల సొమ్మును అదానీ కంపెనీల్లో ఎలా పెట్టుబడులు పెడతారని ప్రశ్నించారు.
ఎవరు బాధ్యత వహిస్తారు?
ఇప్పుడు నష్టపోయిన సొమ్ముకు ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీశారు. మోదీ ప్రభుత్వం పేదలను కొట్టి కార్పొరేట్ సంస్థలకు దోచిపెడుతున్నదని మండిపడ్డారు.
మోదీ అండదండలతోనే..
మోదీ అండదండలతోనే అదానీ ప్రపంచ కుబేరుల్లో స్థానం పొందారని సీపీఐ సీనియర్ నేత చాడ వెంకటరెడ్డి విమర్శించారు. దేశంలోని సహజ వనరులను కొల్లగొట్టి అదానీ లాంటి కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అదానీ సంపాదన వెనుక అనేక కుంభకోణాలు దాగి వున్నాయని ఆరోపించారు. సోమవారం రాష్ట్రంలో 100 కేంద్రాల్లో నిర్వహించిన ఆందోళనల్లో దాదాపు పది వేల మంది కార్యకర్తలు పాల్గొన్నట్టు సీపీఐ నేతలు తెలిపారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా నల్లగొండ, సూర్యాపేట, హుజూర్నగర్, నేరేడుచర్ల, గరిడేపల్లి, కోదాడ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం, అశ్వారావుపేట, దమ్మపేట, అశ్వాపురం, కరీంనగర్ టవర్ సర్కిల్, జగిత్యాల, నిజామాబాద్లోని ఎల్లమ్మగుట్ట, వరంగల్, భూపాలపల్లి, గార్ల, మహబూబాబాద్, నిర్మల్, మంచిర్యాల, తాండూర్, బెల్లంపల్లి, మహబూబ్నగర్, కల్వకుర్తి, మెదక్, సిద్దిపేట జిల్లా చేర్యాల తదితర ప్రాంతాల్లో ఎస్బీఐ, ఎల్ఐసీ కార్యాలయాల వద్ద సీపీఐ కార్యకర్తలు ధర్నాలు నిర్వహించారు.