హైదరాబాద్, జనవరి 11 (నమస్తే తెలంగాణ): బీజేపీని నిలువరించే విషయంలో బీఆర్ఎస్, కమ్యూనిస్టు పార్టీల భావజాలం, ఎజెండా ఒక్కటేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. తెలంగాణలో బీజేపీని అడ్డుకోవడం మునుగోడుతో మొదలైందని చెప్పారు. బీజేపీ ఎంత స్పీడ్ కావాలనుకుంటున్నదో.. అంతే వేగంగా వెన క్కి తరిమికొడతామని అన్నారు. బీఆర్ఎస్ ఆహ్వానం మేరకు ఈ నెల 18న ఖమ్మంలో జరిగే ఆ పార్టీ ఆవిర్భావ సభకు హాజరుకావాలని సీపీఐ, సీపీఎం నిర్ణయించుకున్నట్టు వెల్లడించారు. సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా, కేరళ సీఎం పినరాయి విజయన్ హాజరవుతారని తెలిపారు.
ఏప్రిల్ నెలలో సీపీఐ ఆధ్వర్యంలో కూడా ఖమ్మంలో బహిరంగ సభ నిర్వహించనున్నట్టు వెల్లడించారు. హైదరాబాద్ మఖ్దూంభవన్లో రెండురోజుల పాటు జరిగిన సీపీఐ విస్తృతస్థాయి రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ముగిశాయి. అనంతరం సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి, కార్యదర్శివర్గ సభ్యుడు పల్లా వెంకట్రెడ్డి, పశ్యపద్మ, ఎన్ బాలమల్లేశ్, తక్కలపల్లి శ్రీనివాసరావు, బాలనర్సింహ, కలవేన శంకర్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ.. సిద్ధాంతాలు, భావజాల బలంతో ప్రజలను ఒప్పించడం కాకుండా, ఇతర నాయకులను తమ బలం, యంత్రాంగంతో అదిరించి, బెదిరించడం ద్వారా అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నిస్తున్నదని విమర్శించారు.
ఇలాంటి అదిరింపు, బెదిరింపు, ప్రలోభాలతోనే ఆంధ్రప్రదేశ్లో సుజనాచౌదరి, సీఎం రమేశ్, టీజీ వెంకటేశ్, తెలంగాణలో కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, విశ్వేశ్వరరెడ్డి వంటి వారు చేరారని చెప్పారు. ఇప్పుడు ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాస్రెడ్డి లాంటి మరికొంతమంది ఆ జాబితాలో ఉన్నారని అన్నారు. ఖమ్మం జిల్లాకు కమ్యూనిస్టుల జిల్లాగా పేరుందని, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా బీజేపీని ఎట్టి పరిస్థితుల్లో ఖమ్మంలోకి అడుగుపెట్టనీయబోమని స్పష్టం చేశారు. ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ఒక్క తాటిపై ఉండాలని, ఉమ్మడిగా కార్యాచరణ ఉండాలని రెండు రోజుల క్రితం జరిగిన రెండు పార్టీల రాష్ట్ర నాయకుల సమావేశంలో నిర్ణయించుకున్నట్టు వెల్లడించారు.
సీఎస్ సోమేశ్కుమార్ విషయంలో కోర్టు తీర్పు వచ్చిన వెనువెంటనే ఆయనను తెలంగాణ క్యాడర్ నుండి కేంద్ర ప్రభుత్వం రిలీవ్ చేసిన తీరు అభ్యంతరకరంగా ఉన్నదని కూనంనేని వ్యాఖ్యానించారు. దీని వెనుక కేంద్ర ప్రభుత్వ కుట్ర దాగి ఉన్నదని, గవర్నర్, ఐఏఎస్, ఐపీఎస్ అధికార వ్యవస్థతో కేంద్రం.. రాష్ట్రాలపై పెత్తనం చేయాలని చూస్తున్నదని విమర్శించారు. స్వతంత్రంగా ఉండాల్సిన ఐఏఎస్, ఐపీఎస్ వంటి వ్యవస్థలను కూడా రాజకీయాలతో భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు.