హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): బీజేపీ కో హటావో.. దేశ్ కో బచావో.. అనే నినాదంతో సీపీఐ ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి మే 15 వరకు రాష్ట్రవ్యాప్త యాత్ర నిర్వహిస్తున్నట్టు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు వెల్లడించారు. హైదరాబాద్ మగ్దూంభవన్లో గురువారం ఆయన మాట్లాడారు.
కేంద్రం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలను నిరసిస్తూ సీపీఐ జాతీయ సమితి పిలుపు మేరకు ఈ యాత్రను చేపడుతున్నట్టు వివరించారు. తొలిరోజున అంబేద్కర్ విగ్రహం నుంచి ప్రారంభమయ్యే పాదయాత్ర ఇందిరాపార్క్ వద్దకు చేరుకుంటుందని, అక్కడే సభ జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని మండలా ల్లో ఈ యాత్ర కొనసాగుతుందని, పార్టీ గ్రామ కార్యదర్శి నుంచి రాష్ట్రస్థాయి నేతల వరకు నాలుగైదు లక్షల మంది భాగస్వాములవుతారని వివరించారు.