సైదాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): విధ్వంసక రాజకీయాలు చేస్తున్న బీజేపీని దేశవ్యాప్తంగా ఓడించడమే తమ పార్టీ లక్ష్యమని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ స్పష్టం చేశారు. ‘బీజేపీ హఠావో-దేశ్ బచావో’ అనే నినాదంతో ఏప్రిల్ 15 నుంచి మే 15 వరకు అన్ని రాష్ర్టాల్లోని మహానగరాలు, పట్టణాలు, గ్రామాల్లో సీపీఐ నేతలతో కలిసి పాదయాత్ర నిర్వహిస్తున్న ఆయన.. ఆదివారం హైదరాబాద్లోని మూసారంబాగ్ డివిజన్లో ఆ కార్యక్రమాన్ని నిర్వహించారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అందోజ రవీంద్రాచారి, జిల్లా కార్యదర్శి ఎస్ చాయాదేవీ, రాష్ట్ర సమితి సభ్యుడు బీ వెంకటేశంతో కలిసి ఇంటింటికీ కరపత్రాలను పంచారు.
ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. ప్రజలకు అనేక హామీలిచ్చి మోసగించిన నరేంద్రమోదీ హయాంలో దేశ సంస్కృతితోపాటు ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువలకు అపార నష్టం కలిగించిందని ధ్వజమెత్తారు. ప్రజలు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి దుస్తులు ధరించాలన్నదానిపై బీజేపీ నేతలు హుకుం జారీచేస్తే ఎవరూ ఊరుకోరని, కర్ణాటక మాదిరిగానే దేశమంతటా ఆ పార్టీని తరిమికొట్టడం ఖాయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీపీఐ, ప్రజాసంఘాల నాయకులు ఈటీ నర్సింహ, కమతం యాదగిరి, స్టాలిన్, జీ చంద్రమోహన్గౌడ్, నిర్లేకంటి శ్రీకాంత్, కంపల్లి శ్రీనివాస్, మన్నన్, గ్యార నరేశ్, బైరగోని రాజుగౌడ్, మహమూద్, ఒమర్ ఖాన్, లతీఫ్, జంగయ్య తదితరులు పాల్గొన్నారు.