హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం హిట్లర్ మార్గంలో ప్రయాణిస్తున్నదని సీపీఐ జాతీయ కార్యదర్శి అతుల్ అంజాన్ విమర్శించారు. హైదరాబాద్ మఖ్దూంభవన్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రానున్న 2024 ఎన్నికల్లో 500 ఎంపీ స్థానాలు గెలవడంపై వామపక్ష, ప్రజాస్వామ్య, లౌకిక రాజకీయ పార్టీలు దేశవ్యాప్తంగా దృష్టి కేంద్రీకరించాయని అన్నారు. ప్రజల మెదడును, మీడియాను ప్రధాని మోదీ నియంత్రిస్తున్నారని విమర్శించారు.
బీజేపీ అధ్యక్షుడిని ఆర్ఎస్ఎస్ నిర్ణయిస్తుందని, ఆ పార్టీలో ఎన్నికలే ఉండవని అన్నారు. అధ్యక్ష ఎన్నికలు జరగనున్న కాంగ్రెస్కు ఇప్పటివరకు ఓటర్ల జాబితా సిద్ధం కాలేదని, మరి ఓటు ఎవరు వేస్తారని ఆ పార్టీ నేతలే విస్మయం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ గవర్నర్ లక్ష్మణ రేఖ దాటుతున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ విమర్శించారు. బీజేపీ ప్రతినిధిగా పనిచేస్తున్న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ను వెం టనే రీకాల్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం లో వైద్య సేవల గురించి గవర్నర్ వ్యాఖ్యలు చేస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య సేవలను అదానీకి అప్పగిస్తే ఏం చేస్తున్నారని ఆయన గవర్నర్ తమిళసైని ప్రశ్నించారు. గవర్నర్గా హోదాలో ఉండి రాజకీయాలు చేస్తే చెత్త గవర్నర్ అంటామని, రాజకీయ నాయకులను గవర్నర్గా నియమించే విధానానికి సీపీఐ వ్యతిరేకమని, గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని నారాయణ డిమాండ్ చేశారు.
సీపీఐ రాష్ట్ర నూతన కార్యదర్శిగా మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఎన్నికయ్యారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో మూడు రోజుల పాటు జరిగిన సీపీఐ రాష్ట్ర మూడవ మహాసభలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గం వివరాలను సీపీఐ జాతీయ కార్యదర్శి అతుల్కుమార్ అంజాన్తో కలిసి జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి ప్రకటించారు.