హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): సైద్ధాంతిక ప్రాతిపదికన కమ్యూనిస్టు పార్టీల ఏకీకరణ జరగాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా పిలుపునిచ్చారు. విజయవాడలో నిర్వహించనున్న సీపీఐ జాతీయ మహాసభల ముసాయిదా రాజకీయ తీర్మానంలోనూ ఈ అంశాన్ని పొందుపరిచినట్టు చెప్పారు. సీపీఐ తెలంగాణ రాష్ట్ర మూడో మహాసభల్లో భాగంగా సోమవారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో ప్రతినిధుల సమావేశం నిర్వహించారు.
తొలుత అరుణ పతాకాన్ని సీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి ఆవిషరించారు. డీ రాజా ప్రారంభోపన్యాసం చేస్తూ.. సీపీఎం, సీపీఐ పునరేకీకరణ ఆవశ్యకతను ఇప్పటికే సెంట్రల్ కమిటీలో చర్చించామని తెలిపారు. ప్రజలకు సామాజిక న్యాయం, సమానత్వం అందాలంటే కమ్యూనిస్టు, వామపక్ష శక్తులు బలపడాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. దేశంలో నెలకొన్న నూతన పరిస్థితులు, సవాళ్లను ఎదురొనేందుకు బలమైన పార్టీని నిర్మించాలని పిలుపునిచ్చారు.
వామపక్షాలు బలమైన రాజకీయ శక్తిగా ఎదుగుతూ, ప్రజలను రాజ్యాధికారం దిశగా ఆలోచింపజేయాలని సూచించారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఆరెస్సెస్ ఎజెండాను అమలు చేస్తున్నదని, మతతత్వ, ఫాసిస్టు, పెట్టుబడిదారుల ఆశ్రిత పక్షపాత ప్రభుత్వమని ధ్వజమెత్తారు. ప్రభుత్వరంగాన్ని, లౌకికవాదాన్ని ధ్వంసం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కార్పొరేట్, బడా సంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. ఈ ప్రభుత్వానికి కూలదోయడమే కాకుండా, ప్రత్యామ్నాయాన్ని చూపించాల్సిన బాధ్యత వామపక్షాలపై ఉన్నదని పేర్కొన్నారు. బీజేపీకి వ్యతిరేక పోరాటంలో అన్ని లౌకిక, ప్రజాతంత్ర పార్టీలు కలిసి పోరాడాలని కోరారు.
నయా ఉదారవాద విధానాలతో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అసమానతలు మరింతగా పెరిగిపోయాయని రాజా ఆందోళన వ్యక్తంచేశారు. ఇది పెట్టుబడిదారీ వ్యవస్థ వైఫల్యమని, దీనికి ప్రత్యామ్నాయం సోషలిజమేనని చెప్పారు. ఇప్పటికే లాటిన్ అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, ఆసియా దేశాల్లో పలుచోట్ల వామపక్ష, వామపక్ష భావాలు కలిగిన ప్రభుత్వాలను ప్రజలు ఎన్నుకొంటున్నారని వివరించారు.
శ్రీలంక లాంటి పరిస్థితులే దేశంలో ఉన్నాయని, ఈ సంక్షోభానికి ప్రత్యామ్నాయం సోషలిజమేనని స్పష్టంచేశారు. సురవరం సుధాకర్రెడ్డి మాట్లాడుతూ.. పాలకుల విధానాలు, ఆర్థిక సంక్షోభం, మతోన్మాద నేపథ్యంలో దేశానికి కమ్యూనిస్టుల అవసరం పెరుగుతున్నదని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టులు పురోగమిస్తున్నారని, పలు దేశాల్లో జరిగిన ఎన్నికల్లో కమ్యూనిస్టులు విజయం సాధించడం ఇందుకు నిదర్శనమని చెప్పారు. పార్లమెంట్ లోపల, బయట విసృ్తత పోరాటాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.