కరీంనగర్ తెలంగాణచౌక్/తిమ్మాపూర్ రూరల్, అక్టోబర్ 28: మునుగోడులో బీజేపీకి ఓటమి తప్పదని, ఇక్కడి నుంచే ఆ పార్టీ పత నం ప్రారంభమవుతుందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి అన్నారు. ఈ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అఖండ విజయం సాధిస్తుందని తెలిపారు. ఒక్క ఎమ్మె ల్యే సీటు కోసం అమిత్షా ఉప ఎన్నిక తీసుకువచ్చారని విమర్శించారు.
శుక్రవారం ఆయన కరీంనగర్లోని సీపీఐ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. మునుగోడులో కమ్యూనిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉంటుందని, ఇక్కడ సీపీఐ అభ్యర్థి నాలుగుసార్లు గెలిచారని గుర్తుచేశారు. దేశవ్యాప్తంగా బీజేపీని ఓడించేందుకు కంకణం కట్టుకున్నామని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహరంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.