హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ సతీమణి వసుమతి (67) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె తిరుపతిలోని ఓ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ గురువారం సాయంత్రం మృతిచెందారు. మూడురోజుల క్రితం వైద్యులు అమెకు స్టంట్ వేసినట్టు సమాచారం. శుక్రవారం ఉదయం 11 గంటలకు నారాయణ స్వగ్రామం అయినంబాకం (నగిరి సమీప గ్రామం)లో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు. ఆమె మరణవార్త తెలుసుకున్న పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.
వసుమతి మృతికి సీఎం కేసీఆర్ సంతాపం
సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ సతీమణి వసుమతి మృతికి సీఎం కే చంద్రశేఖర్రావు సంతాపాన్ని, కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అలాగే, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రులు హరీశ్రావు, వీ శ్రీనివాస్గౌడ్, ఎర్రబెల్లి దయాకర్రావు, జగదీశ్రెడ్డి, పువ్వాడ అజయ్, నిరంజన్రెడ్డి, వేముల ప్రశాంత్రెడ్డి, సత్యవతి రాథోడ్, అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, తలసాని శ్రీనివాస్యాదవ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్చైర్మన్ బోయినపల్లి వినోద్కుమార్, రాష్ట్ర మీడియా అకాడెమీ చైర్మన్ అల్లం నారాయణ వసుమతి మృతికి సంతాపాన్ని, కుటుంబసభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.