హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్తో పొత్తు కుదరని కామ్రేడ్లు వేదాంత ధోరణికి దిగినట్టు తెలుస్తున్నది. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ గురువారం చేసిన రెండు ట్వీట్లు ఆ పార్టీ నిరాశా నిస్పృహలను వెల్లడిస్తున్నదని పరిశీలకులు పేర్కొంటున్నారు. ‘నిశ్చితార్థం జరిగిన తరువాత వేరేవాళ్లు నచ్చారంటూ లగేస్కు వెళ్లడం నిజ జీవితంలో అక్కడక్కడా చూస్తుంటాం కానీ, రాజకీయాల్లో కుదరదు’ అంటూ నారాయణ ట్వీట్ చేశారు.
“..వేశ్యకు కూడా ఒక నీతి ఉంటుంది స్వామి అని కన్యాశుల్కం నాటకంలో మధురవాణి చెబుతుంది.. మరి తాజా రాజకీయాలలో..???’ అంటూ మరో ట్వీట్ చేశారు. జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో చేరిపోయిన కమ్యూనిస్టులు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్తో దోస్తీ చేయలేకపోయారు. సీపీఐ, సీపీఎం పార్టీల డిమాండ్లను.. కాంగ్రెస్ పట్టించుకోలేదు. దీంతో ఒంటరిగానే బరిలోకి దిగాలని నిర్ణయించుకున్న సీపీఎం ఇప్పటికే 17 మందితో తొలి జాబితాను ప్రకటించింది. సీపీఐకి కూడా మరో గత్యంతరం లేనప్పటికీ అధికారికంగా ఇంకా ఎటువంటి ప్రకటన చేయలేదు.