కవాడిగూడ, మే 31: ప్రధాని మోదీకి తన దుస్తులపై ఉన్న శ్రద్ధ దేశంపై లేదని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ ఎద్దేవా చేశారు. అమెరికా ఒత్తిడికి తలొగ్గి కార్పొరేట్ వ్యవస్థను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. దేశంలో రైతాంగం తీవ్ర కష్టంలో ఉన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఇందిరాపార్కు ధర్నాచౌక్లో వివిధ వామపక్ష సంఘాల ఆధ్వర్యంలో అధిక ధరలు, పన్నుల భారాలకు వ్యతిరేకంగా మహాధర్నా నిర్వహించారు. దీనికి హాజరైన నారాయణ మాట్లాడుతూ.. మోదీ వచ్చే ప్రభుత్వ రంగాన్ని నాశనం చేశారని ఆరోపించారు. 14 మంది ప్రధానులు రూ.42 లక్షల కోట్ల అప్పులు చేస్తే, మోదీ ఒక్కరే రూ.83 లక్షల కోట్ల అప్పు చేశారని అన్నారు. 23 ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేశారని చెప్పారు.
ఇప్పటి వరకు 29 మంది అప్పులు చేసి దేశం వదిలిపెట్టి వెళ్లిపోయారని, వారిపై చర్యలు తీసుకోకపోవడమే కాకుండా వారి అప్పులు రద్దు చేస్తున్నారని మోదీపై మండిపడ్డారు. జలమార్గాన్ని, విశాఖ స్టీల్ను ప్రైవేటు పరం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఎస్ఎన్ఎల్ను నిర్వీర్యం చేసి ప్రైవేట్ టెలికం రంగ ఆదాయాన్ని పెంచిన ఘనత మోదీదేనని మండిపడ్డారు. విభజన చట్టంలో ఉన్న బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడరు కానీ, ఇక్కడ ఏం వెలగబెట్టడానికి సభలు పెడుతున్నాడని నిలదీశారు. ధర్నాలో సీపీఐఎంఎల్ ప్రజాపంథా నాయకురాలు కట్టా రమ, సీపీఎం కార్యదర్శి వర్గ సభ్యుడు ఎస్ వీరయ్య, న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి సాధినేని వెంకటేశ్వర్రావు, కార్యదర్శి వర్గ సభ్యురాలు ఝాన్సీ, ఆరెస్పీ రాష్ట్ర కార్యదర్శి జానకిరాములు, ఎస్యూసీసీ రాష్ట్ర కార్యదర్శి సీహెచ్ మురహరి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు డీజీ నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.