హైదరాబాద్ : తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీ ప్రభుత్వం నియమించిన గవర్నర్లు.. మోదీ అజెండాను అమలు చేస్తున్నారని మండిపడ్డారు. గవర్నర్లు కేంద్ర దళారులు, బ్రోకర్లుగా ఉండకూడదని సూచించారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై లక్ష్మణరేఖ దాటుతున్నారని నిప్పులు చెరిగారు. ప్రజా దర్బారు ఎలా నిర్వహిస్తారు? ప్రజల సమస్యలను గవర్నర్ ఏ విధంగా పరిష్కరించగలుగుతారు? అని తమిళిసైపై ప్రశ్నల వర్షం కురిపించారు.
శుక్రవారం ఆయన తిరుపతిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కేంద్ర కేబినెట్లో నేరస్థులున్నారని ఆరోపించారు. జార్ఖండ్ సీఎంను పదవి నుంచి తప్పించాలని కేంద్రం శత విధాల ప్రయత్నించిందని పేర్కొన్నారు. మోదీ పాలనలో దేశం అధోగతి పాలైందన్నారు. దేశంలోని అన్ని వర్గాల ప్రజలు అనేక ఇబ్బందులను ఎదర్కొంటున్నారని, నిలదీసే ప్రత్యర్థులపై ఈడీచే దాడులకు పురిగొల్పి భయాందోళనలకు గురి చేస్తుందని మండి పడ్డారు. లిక్కర్ స్కామ్లో కేసీఆర్ కుటుంబాన్ని ఇరికించాలని చూశారని వెల్లడించారు. దేశాన్ని దోచుకుంటున్న అదానీ జోలికి ఎందుకు వెళ్లడం లేదని నారాయణ ప్రశ్నించారు. బీజేపీని వ్యతిరేకిస్తున్న పార్టీలు ఏకం కావాలని పిలుపునిచ్చారు.