నల్లగొండ, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): అర్ధరాత్రి ధర్నాలతో శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం ద్వారా మునుగోడు ఉప ఎన్నిక రద్దు చేయించడానికి బీజేపీ నాయకులు కుట్ర పన్నుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. ఓటమి భయంతో ఘర్షణలను సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీజేపీ నేతలు ధర్నాల పేరుతో శాంతిభద్రతల సమస్యను సృష్టిస్తుంటే ఈసీ, కేంద్ర పరిశీలకులు ఎందుకు మౌనంగా ఉన్నారని కూనంనేని ప్రశ్నించారు.
ప్రశాంత వాతావరణం చెడగొట్టేలా కుట్రలు చేస్తూ ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తున్న రాజగోపాల్రెడ్డికి ఓటమి భయం పట్టుకొన్నదని సీపీఐ, సీపీఎం జిల్లా కార్యదర్శులు నెల్లికంటి సత్యం, ముదిరెడ్డి సుధాకర్రెడ్డి విమర్శించారు. ఆర్వో ఆఫీసు, పోలీస్ స్టేషన్ల ముందు అర్ధరాత్రి ధర్నాలు ఏమిటని ప్రశ్నించారు. కమ్యూనిస్టుల అడ్డా అయిన మునుగోడులో మతోన్మాద బీజేపీకి చోటు లేదని స్పష్టం చేశారు.