హైదరాబాద్, అక్టోబర్16 (నమస్తే తెలంగాణ): ప్రజా సమస్యలపై జాతీయ స్థాయిలో మరింత దూకుడుగా పోరాడాలని, లాఠీలను, తూటాలను ఎదురొనేందుకు, జైళ్లకు వెళ్లేందుకు సిద్ధపడాలని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గతంలో మాదిరిగా మిలిటెంట్ పోరాటాల పార్టీగా మారాలని, తద్వారా జన సమూహాలను ఆకర్షించి పూర్వవైభవం పొందాల్సిన అవసరం ఉన్నదన్నారు.
విజయవాడలోని కామ్రేడ్ గురుదాస్ దాస్గుప్తానగర్ (ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్ )లోని కామ్రేడ్ షమీమ్ ఫైజీ హాల్లో జరుగుతున్న సీపీఐ 24వ జాతీయ మహాసభలో ప్రవేశపెట్టిన తీర్మానాలపై జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. మరో రెండేండ్లలో కమ్యూనిస్టు పార్టీ శతాబ్ది ఉత్సవాలను చేసుకోనున్నదని, దేశంలో జనతాపార్టీ, జనతాదళ్ వంటి అనేక పార్టీ లు ఏర్పడి, అంతరించిపోయాయన్నారు. కానీ సీపీఐ మాత్రం స్థిరంగా వందేండ్ల ప్రస్థానం వైపు కొనసాగుతున్నదని చెప్పారు. సంతృప్తి పడితే సరిపోదని, కొత్త పార్టీలు ఒకటి, రెండు రాష్ట్రాలలో అధికారం సాధించడమే కాకుండా, ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించే ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు.
గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలి..
గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. కేరళ సహా విపక్ష ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్ వ్యవస్థ దుర్వినియోగమవుతున్న తీరును అందరూ గమనిస్తున్నారని చెప్పారు. తెలంగాణలో సైతం అదే పరిస్థితి నెలకొన్నదని, గవర్నర్ తీరుపై ఇప్పటికే తాము నిరసన తెలియజేశామని తెలిపారు.