హనుమకొండ, జూలై 7: రాష్ట్ర విభజన హామీ లు అమలు చేయని ప్రధానికి తెలంగాణలో అడుగు పెట్టే అర్హత లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. శనివారం వరంగల్లోని ప్రధాని మోదీ పర్యటనను నిరసిస్తూ సీపీఐ ఆధ్వర్యంలో శుక్రవారం హనుమకొండలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ఏకశిలా పా రు ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ.. విభజన చట్ట హామీలు అమలు చేయకుండా మోదీ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో ఉకు పరిశ్రమ, ములుగులో గిరిజన వర్సిటీతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదని మండిపడ్డా రు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇప్పటికే కాజీపేటలో ఉన్న పీరియాడికల్ వ్యాగన్ ఓవర్ హాలింగ్ వర్షాప్ స్థానంలో వ్యాగన్ రిపేర్ సెంటర్ అని, తాజాగా వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూని ట్ అని చేతులు దులుపుకొనే ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు.
మోదీ సర్కారు మహారాష్ట్రలోని లాథూర్తోపాటు గుజరాత్లో కోచ్ ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసిందని, కాజీపేటలో ఎందుకు నెలకొల్పలేదని ప్రశ్నించారు. కోచ్ ఫ్యాక్టరీని మరుగున పడేసేందుకే కేవలం రూ.521 కోట్లతో వ్యాగన్ తయారీ పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ అభివృద్ధిపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధిలేదని, కేవలం ఎన్నికల లబ్ధికోసమే కాజీపేటలో వ్యాగన్ యూనిట్ పేరుతో మభ్యపెడుతున్నారని విమర్శించారు. మామునూర్ ఎయిర్ పోర్టును అభివృద్ధి పరచలేదని, గడిచిన తొమ్మిదేండ్ల పాలనలో ఒక పరిశ్రమను కూడా వరంగల్లో ఏర్పాటు చేయలేదని విమర్శించారు.
ఏం నేరం చేశారని అరెస్టులు?
హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): విభజన హామీలను అమలు చేయని ప్రధాని పర్యటనను నిరసిస్తూ సీపీఐ ఆధ్వర్యంలో ధర్నాలు చేస్తే అరెస్ట్ చేస్తారా? అని కూనంనేని సాంబశివరావు ప్రశ్నించారు. మోదీ వైఖరిని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్నట్టు పేర్కొన్నారు. సీపీఐతోపాటు ప్రజాసంఘాల నాయకులను ముందస్తుగా ఉదయమే ఇండ్ల వద్ద అరెస్టు చేయడం దారుణమని అన్నారు. అరెస్టు చేసిన వారిని ప్రధాని పర్యటన ముగిసే వరకు జెళ్లలో ఉంచడం అన్యాయమని తెలిపారు. వారిని వెంటనే విడుదల చేయాలని కూనంనేని డిమాండ్ చేశారు. ప్రధాని పర్యటనను నిరసిస్తూ శనివారం కూడా నిరసన ప్రదర్శనలు చేపడతామని హెచ్చరించారు.