హైదరాబాద్ సిటీబ్యూరో, మే 6 (నమస్తే తెలంగాణ): కేంద్ర హోంమంత్రి అమిత్షా వీడియో మార్ఫింగ్ కేసు ఢిల్లీ కంటే ముందే హైదరాబాద్లో నమోదైందని నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి చెప్పారు. ఒకే నేరంపై రెండు చోట్ల కేసులు అవసరం లేదని, ఇద్దరు దర్యాప్తు చేస్తే గందరగోళానికి కారణం అవుతుందని అభిప్రాయపడ్డారు. సీసీఎస్లో సోమవారం మీడియా సమావేశంలో ఈ కేసు గురించి ఆయన మాట్లాడుతూ.. ఐటీ యాక్ట్ కావడంతో దేశంలో ఎక్కడైనా కేసు నమోదు చేయవచ్చని, అయితే ఒకే నేరంపై రెండు చోట్ల కేసులు అనవసరంమని ఇటీవల ఢిల్లీ స్పెషల్ డీసీపీ వచ్చి తనను కలిసినప్పుడు చెప్పానని వెల్లడించారు. డీసీపీ అడిగిన వివరాలు కూడా అందించామని చెప్పారు.
గత నెల 26న బీజేపీ నాయకులు ఫిర్యాదు చేశారని, ఫిర్యాదుతోపాటు వీడియో కావాలని కోరామని తెలిపారు. మరుసటి రోజు పెన్డ్రైవ్లో తెచ్చి ఇవ్వడంతో కేసు నమోదు చేశామని తెలిపారు. ఎక్స్(ట్విట్టర్)ను సంప్రదించి వివరాలు కోరగా 72 గంటల్లో ఇస్తామన్నారని, ఆ తరువాత మరికొంత సమయం పట్టిందని, ట్విట్టర్కు లెటర్ రాసి ఎక్కడి నుంచి అది పోస్ట్ అయ్యిందో గుర్తించి ఐదుగురిని అరెస్టు చేశామని పేర్కొన్నారు.