హైదరాబాద్: కొవిడ్ నుంచి కోలుకున్న వారు ప్లాస్మాదానం చేయాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ పిలుపునిచ్చారు. ఎలాంటి అపోహలు లేకుండా ప్లాస్మాదానం చేయొచ్చని.. ప్లాస్మాదానం చేయాలన్నా, కావాలన్నా సైబరాబాద్ కొవిడ్ కంట్రోల్ నంబర్ 9490617440 లేదా
donateplasma.scsc.inలో రిజిస్టర్ చేసుకోవాలని సీపీ సూచించారు.
ఎవరు అర్హులు..
కరోనా నుంచి కోలుకున్న వ్యక్తి రక్తంలో యాంటీబాడీలు అధికంగా ఉంటాయి. ఒక వ్యక్తికి వైరస్ సోకిన 28 రోజుల తర్వాత వాటి అవశేషాలు లేవని నిర్ధారించిన అనంతరం నాణ్యత పరీక్షిస్తారు. రోగ నిరోధక కణాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకోవడానికి ఎలీసా పరీక్ష చేస్తారు. దానం చేస్తే వ్యక్తి బరువు కనీసం 55 కిలోలు, రక్తంలో హీమోగ్లోబిన్ 12 శాతం ఉండాలి. ఒక వ్యక్తి నుంచి 800 మిల్లీ లీటర్ల రక్తం సేకరిస్తే.. 400 మిల్లీ లీటర్ల ప్లాస్మా తీసుకునే అవకాశం ఉంది. దీర్ఘకాలిక రోగుల నుంచి ప్లాస్మా తీసుకోరు. వెంటిలేటర్పై చికిత్స పొందుతూ ఔషధాలకు నయంకాని సందర్భంలోనే ప్లాస్మా ఎక్కిస్తారు.